మాయావతి ఇంటికెళ్లిన కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం!

  • ముందస్తు అనుమతి లేకుండా భేటీకి యత్నం
  • తిరస్కరించిన మాయావతి సెక్యూరిటీ
  • లోపలికి రానివ్వని బీఎస్పీ అధినేత్రి
  • మర్యాదపూర్వక సందర్శన అని నేతల వివరణ
  • కాంగ్రెస్‌ సీరియస్‌.. నేతలకు షోకాజ్‌ నోటీసు 
లక్నోలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ముందస్తు అనుమతి లేకుండా బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి ఇంటికెళ్లిన ఇద్దరు కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతించకపోవడంతో వెనుతిరగాల్సి వచ్చింది.

అపాయింట్‌మెంట్ లేదు..
కాంగ్రెస్ నాయకులు రాజేంద్ర పాల్ గౌతమ్, బారాబంకీ ఎంపీ తనూజ్ పునియా మంగళవారం లక్నోలోని మాయావతి నివాసానికి వెళ్లారు. ఆమెతో భేటీ కావాలని కోరారు. భద్రతా సిబ్బంది ఈ సమాచారాన్ని లోపలికి పంపారు. అయితే వారిని కలవడానికి ఆమె నిరాకరించారు.

ఆరోగ్యంపై ఆరా తీసేందుకేనా?
మీడియా ప్రతినిధులు దీనిపై ప్రశ్నించగా కాంగ్రెస్ నేతలు దాటవేశారు. మాయావతి ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికే వచ్చామని చెప్పారు. ఆమె చాలా రోజులుగా బయట కనిపించడం లేదని, అందుకే మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చామని వివరించారు. రాహుల్ గాంధీ సందేశాన్ని తెచ్చారనే ప్రచారాన్ని పునియా ఖండించారు.

కాంగ్రెస్ సీరియస్
ఈ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఇది అనధికారిక పర్యటన అని స్పష్టం చేసింది. పార్టీ అనుమతి లేకుండా వెళ్లినందుకు ఇద్దరు నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పెద్ద నాయకులను కలిసేటప్పుడు ముందే అనుమతి తీసుకోవాలని యూపీ కాంగ్రెస్ విభాగం తెలిపింది.

పొత్తుల కోసం ప్రయత్నాలు
యూపీలో బీజేపీని ఎదుర్కొనేందుకు మాయావతిని కూటమిలోకి తేవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)తో కాంగ్రెస్‌కు పొత్తు ఉంది. మాయావతి కూడా తోడైతే ఓట్ల చీలికను ఆపొచ్చని కాంగ్రెస్ వ్యూహం. అయితే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని మాయావతి ఇదివరకే ప్రకటించారు.

More Telugu News